1, సెప్టెంబర్ 2018, శనివారం

ఏమిటీ కార్టూన్ అర్ధం!

 

ఈ కార్టూన్ అర్ధం కావాలంటే, అప్పటి నేపధ్యం తెలియాలి. ఈ కార్టూన్ వేసిన సమయం జనవరి 1970. అంటే కాంగ్రెస్ రెండు ముక్కలయ్యి గట్టిగా ఆరేడు నెలలు కూడా కాలేదు.

కాంగ్రెస్ కు గుర్తు జోడు కాడెద్దులు. ఇంతగా న్యాయం,ధర్మం అని ఉపన్యాసాలు ఇచ్చే నెహ్రూ, మనది వ్యావసాయిక దేశం కదా, పైగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న దేశం. అటువంటప్పుడు, ఇంతగా గ్రామీణులను ఎక్కువగా ప్రభావపరిచే గుర్తు పార్టీకి పెట్టుకుంటారా? అలా పెట్టటం ఎంతవరకూ సబబు!?  సుభాషితాలు ఉపదేశించటం  వ్యాసాలలో, తన కూతురుకు ఉత్తరాలలో,  లేదంటే ఉపన్యాసాలలో చెప్పటం సులువే. కానీ అవి స్వయంగా పాటించటమే గొప్ప నాయకుని లక్షణం. అదే లోపించింది.

అందుకనే, ప్రముఖ రచయిత, సంపాదకుడు శ్రీ పురాణం సుబ్రహమణ్య శర్మ తన ఇల్లాలి ముచ్చట్ల వ్యాస పరంపరలో  "ఎన్నికలలా" అనే  వ్యాసంలో ఇలా అన్నారు 

"...వాళ్ళకు జాతీయ పతాకానికి, కాంగ్రెసు జండాకి వున్న తేడా తెలీదు. ఇలాంటి ప్రజలుంటారనే మన నెహ్రూగారు కాంగ్రెసు జండాలో రాట్నం పీకిపారేసి చక్రం పెట్టారు. ఆ జండా ఈ జండాఒకటే అనే భావం కలిగేలా జాతీయ పతాకాన్ని రూపొందించకుండా వుండవలసింది".

సరే, ప్రస్తుతం కార్టూన్ విషయానికి వస్తే, అక్కడ ఉన్న ఇద్దరూ అప్పటి కాంగ్రెస్ గుర్తు ఐన కాడి జోడెద్దుల గురించి వాదులాడుకుంటున్నారు. గుర్తులో ఉన్న రెండు ఎద్దులూ చేరోకటీ తీసుకున్నా, కాడిని ఏమి చెయ్యాలి అని ఒకాయన వితండం చెయ్యటం జోకుగా వేసారు ఊమెన్ గారు. 

తరువాత, రెండు ముక్కల్లో కొత్త కాగ్రెస్, ఆవు దూడ గుర్తుగా తీసుకున్నది. విచిత్రం చూడండి. సెక్యూలర్ అని ఒకపక్క అరిచి గోలపెడుతూ, హిందువులకు పవిత్రమైన ఆవును తమ గుర్తులో పెట్టుకుని, హిందూ వోట్లను 1979-80 వరకూ ఆ పార్టీ విజయవంతంగా ప్రభావితం చెయ్యగలిగింది.

భూసంస్కరణలు!

కాంగ్రెస్ తమను తాము ప్రభుత్వంలో ఎల్లకాలమూ ఉంచుకోవటానికి తెచ్చిన ఒక "సద్దుపాటు" సంస్కరణ భూ సంస్కరణ. ఎదో సోషలిష్టు వ్యవస్థ తీసుకువస్తున్నట్టు నటిస్తూ, నిజానికి ఏమీ చెయ్యనివి ఈ భూ సంస్కరణలు. బాంకు పరీక్షల్లో బారతీయ ఆర్ధిక సమస్యల గురించి చదువుకున్నప్పుడు తెలిసింది, దేశంలోకెల్లా అత్యధిక విడాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఇవ్వబడ్డాయట. కారణం, విడాకులు తీసుకుంటే, రెండు యూనిట్ల కింద లెక్కేసి ఎక్కువ భూమి ఆ కుటుంబానికి ఉంటుంది.

అదీ కాక, ఈ సంస్కరణలు తీసుకు వచ్చినది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ పార్టీ వారు కాని, కాంగ్రెస్ భక్తులు కానీ పెద్దగా ఈ సంస్కరణలను పాటించినట్టు కనపడదు. ఎవరికి వాళ్ళు సద్దుకున్నారు కానీ, సంస్కరణల్లో భూమి ఇచ్చిన కాంగ్రెస్ సమర్ధకులు కరువయ్యారు. ఎక్కడన్నా ఒకళ్ళో-ఇద్దరో అమాయకులు బలి అయిపోయి ఉండొచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో, అప్పట్లో ముఖ్య మంత్రి పి వి నరసింహారావు తీసుకు వచ్చిన  భూ సంస్కరణలను దెబ్బ తియ్యటానికి,1972-73లోప్రత్యెక ఆంధ్ర ఉద్యమం తీసుకు వచ్చారని ఒక పుకారు ఉన్నది.  

సంతోషించారు కానీ - వాళ్ళకు ప్రయోజనం లేకపోయింది


 
1960లలో, కమ్యూనిష్టు పార్టీ రెండు ముక్కలు అవ్వటం వాళ్ళ దృష్టిలో ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టం అనుకుంటారు కానీ, అలా జరగటం మన దేశంలో  ఎవ్వరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎదో కమ్యూనిష్టులు అనే కాని, రెండు ముక్కలు అయినా, ఆతరువాత ఎన్ని ముక్కలు అయ్యినా పెద్దగా ప్రజల్లో  "గణింపు" లేకపోయింది. కానీ అప్పటికే, స్వతంత్రం  వచ్చిన దగ్గరనుండీ దేశాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్, 1969 లో కుటుంబ పాలన కోసం రెండు ముక్కలు అయ్యింది. అలా రెండు ముక్కలు కావటానికి ఎవరు కారణమో అందరికీ తెలుసు.

ఇలా కాంగ్రెస్ రెండు ముక్కలు కావటం తమకేదో లాభిస్తుందని కమ్యూనిష్టులు భావించారని ఊమెన్ గారు వేసిన కార్టూన్. తాము అప్పటికే రెండు ముక్కలు అయ్యి, ఉన్న కాస్త బలం పోయి, బలహీనపడి తమ సంగతి చూసుకోకుండా వేరే పార్టీ రెండు ముక్కలు అవటాన్ని సంతోషంగా చెప్పుకోవటం పెద్ద జోకు. 

అప్పటికి అంటే జనవరి 1970 కి కాగ్రెస్ రెండు ముక్కలయ్యి జస్ట్ కొన్ని నెలలు మాత్రమె అవటం వలన, ఆయన వేసిన కార్టూన్ లో వాళ్ళు అలా సంతోషిస్తూ కనిపిస్తున్నట్టు వేశారు.  కానీ తరువాత్తరువాత జరిగిన ఎన్నికల పరిణామాలు పరిశీలిస్తే, కాంగ్రెస్ కు ఏమైనా, కమ్యూనిష్టులకు మాత్రం లాభం జరగలేదన్న విషయం తెలుస్తుంది. కాకపొతే, కాంగ్రెస్ చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల, బెంగాల్ లో మాత్రం, కమ్యూనిష్టు ముక్కల్లో ఒకటి,  మూడు దశాబ్దాలు తమ "కబ్జా" పెట్టగలిగారు.

ఆణిగిపోయింది - అంతం కాలేదు!

 No automatic alt text available.
ఎప్పుడో 1972 లో ఊమెన్ గారు వేసిన కార్టూన్. అప్పటికే వోటర్లు కమ్యూనిష్టుల మీద వైముఖ్యం చూపించటం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కొన్ని కొన్ని అవకతవకల వాళ్ళ బెంగాలులో మూడు దశాభ్దాలు ఆ రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించినా, దేశపు అదృష్టం బాగుంది, జాతీయంగా పెద్దగా పైకి రాలేకపోయ్యారు.

ఇప్పటికి కూడా "నోటా"మాత్రపు వోట్లు రాని వామపక్షవాదులు చేస్తున్న "అల్లరి" చూస్తూనే ఉన్నాము.

ఆకాశవాణి ప్రామాణికత

 No automatic alt text available.

ఇప్పుడు అంటే ఆకాశవాణి ఒక్కటి మాత్రమె వినోద/సమాచార సాధనం కాదు. అనేకం ఉన్నాయి. ఇంటర్నెట్ వచ్చినాక, సమాచార విప్లవం జరిగి అరిచేతులో ఇమిడిపొయ్యే, మల్టీ పర్పస్ గాడ్జెట్ సెల్ ఫోన్ వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఏమూల ఏమి జరిగినా క్షణాల్లో ప్రజలకు తెలిసిపోతున్నది.

కానీ దాదాపుగా 1990 మధ్య వరకూ కూడా, రేడియో అనేది మన దేశంలో ప్రధాన సమాచారా సాధనం. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి వచ్చే వార్తలు క్రమం తప్పకుండా ప్రజలు వినేవాళ్ళు. కానీ కాల క్రమేణా, ఆకాశవాణి వార్తలు, ఇతర కార్యక్రమాలూ, ముఖ్యంగా 1971 దగ్గరనుంచీ కూడా, ప్రభుత్వ కార్యక్రమాలను కీర్తిస్తూ (సమాచారం ఇవ్వటం కాదు) చేసిన కార్యక్రమాలే ఎక్కువ. పాలక పార్టీ కీ చెందిన ఒకే ఒక్క నాకయకురాలి మాటలు సుభాషితాలు లాగా ప్రచారం (ప్రసారం కాదు) చేసేవారు.

అలా మెల్లి-మెల్లిగా తన ప్రామాణికతను పోగొట్టుకుంటున్న ఆకాశవాణి మీద ఊమెన్ గారు వేసిన ఒక "విసురు" ఈ కార్టూన్లు.

జస్ట్ మూడు సంవత్సరాల తరువాత అప్పటి ప్రధాని తన పదవి కాపాడుకోవటానికి దేశంలో అవసరం లేని ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాధమిక హక్కులను "సస్పెండ్" చేసినప్పుడు, ఆకాశవాణి విని ఎవ్వరూ వార్తలు తెలుసుకునేవారు కాదు. ఎంతయినా విచారకర విషయం ఏమంటే, భారత దేశంలో జరుగుతున్నా ముఖ్య సంఘటనల గురించి పరాయిం దేశాల రేడియో స్టేషన్ల మీద ఆధారపడవలసి వచ్చింది. బి బి సి, వాయిస్ ఆఫ్ అమెరికా వంటి విదేశీ వార్తా సంస్థల వార్తల నుండి మాత్రమె ఎమెర్జెన్సీ సమయంలో, దేశంలో జరిగిన/జరుగుతున్నా అవకతవకలను ప్రజలు తెలుసుకోగలిగారు.

బ్లాక్ మనీ

 No automatic alt text available.

ఊమెన్ గారు అప్పుడెప్పుడో 1972 లో వేసిన కార్టూన్ ఇది. ఇప్పటికి కూడా ఎంతో సరిపొయ్యే కార్టూన్. సంపాయించుకున్న దాంట్లో ఎక్కువ భాగం టాక్సులకే అన్నప్పుడు, ఆ కట్టిన టాక్సులకు తగిన సర్వీస్ తనకు రానప్పుడు, పౌరుడు టాక్సు ఎందుకు కడతాడు. సవ్యంగా పన్నులు కడుతున్న మనిషులను మరిన్ని టాక్సులు వేసి టాక్సు ఎగ్గొడితే అనే ఆలోచన ప్రభుత్వమే తీసుకొస్తున్నది అన్న మాట ముమ్మాటికీ నిజం.