ఈ కార్టూన్ అర్ధం కావాలంటే, అప్పటి నేపధ్యం తెలియాలి. ఈ కార్టూన్ వేసిన సమయం జనవరి 1970. అంటే కాంగ్రెస్ రెండు ముక్కలయ్యి గట్టిగా ఆరేడు నెలలు కూడా కాలేదు.
కాంగ్రెస్ కు గుర్తు జోడు కాడెద్దులు. ఇంతగా న్యాయం,ధర్మం అని ఉపన్యాసాలు ఇచ్చే నెహ్రూ, మనది వ్యావసాయిక దేశం కదా, పైగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న దేశం. అటువంటప్పుడు, ఇంతగా గ్రామీణులను ఎక్కువగా ప్రభావపరిచే గుర్తు పార్టీకి పెట్టుకుంటారా? అలా పెట్టటం ఎంతవరకూ సబబు!? సుభాషితాలు ఉపదేశించటం వ్యాసాలలో, తన కూతురుకు ఉత్తరాలలో, లేదంటే ఉపన్యాసాలలో చెప్పటం సులువే. కానీ అవి స్వయంగా పాటించటమే గొప్ప నాయకుని లక్షణం. అదే లోపించింది.
అందుకనే, ప్రముఖ రచయిత, సంపాదకుడు శ్రీ పురాణం సుబ్రహమణ్య శర్మ తన ఇల్లాలి ముచ్చట్ల వ్యాస పరంపరలో "ఎన్నికలలా" అనే వ్యాసంలో ఇలా అన్నారు
"...వాళ్ళకు జాతీయ పతాకానికి, కాంగ్రెసు జండాకి వున్న తేడా తెలీదు. ఇలాంటి ప్రజలుంటారనే మన నెహ్రూగారు కాంగ్రెసు జండాలో రాట్నం పీకిపారేసి చక్రం పెట్టారు. ఆ జండా ఈ జండాఒకటే అనే భావం కలిగేలా జాతీయ పతాకాన్ని రూపొందించకుండా వుండవలసింది".
సరే, ప్రస్తుతం కార్టూన్ విషయానికి వస్తే, అక్కడ ఉన్న ఇద్దరూ అప్పటి కాంగ్రెస్ గుర్తు ఐన కాడి జోడెద్దుల గురించి వాదులాడుకుంటున్నారు. గుర్తులో ఉన్న రెండు ఎద్దులూ చేరోకటీ తీసుకున్నా, కాడిని ఏమి చెయ్యాలి అని ఒకాయన వితండం చెయ్యటం జోకుగా వేసారు ఊమెన్ గారు.
తరువాత, రెండు ముక్కల్లో కొత్త కాగ్రెస్, ఆవు దూడ గుర్తుగా తీసుకున్నది. విచిత్రం చూడండి. సెక్యూలర్ అని ఒకపక్క అరిచి గోలపెడుతూ, హిందువులకు పవిత్రమైన ఆవును తమ గుర్తులో పెట్టుకుని, హిందూ వోట్లను 1979-80 వరకూ ఆ పార్టీ విజయవంతంగా ప్రభావితం చెయ్యగలిగింది.